- మణుగూరు ఓపెన్ కాస్ట్ గని సందర్శన
భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: సింగరేణి బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగానికి విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్తో కలిసి శుక్రవారం భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, డీఏవీ స్కూల్ను, మణుగూరు ఓపెన్ కాస్ట్ (ప్రకాశం ఖని) గనిని సందర్శించారు. అనంతరం సింగరేణి, జెన్కో అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో క్రిటికల్ మినరల్స్ బ్లాకుల వేలంలో పాల్గొనేలా సిద్ధం కావాలన్నారు. ప్రైవేట్ పోటీ పెరిగినందున క్వాలిటీ పెంపు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నైనీ కోల్ బ్లాక్, తాడిచర్ల-2 ఫారెస్ట్ పర్మిషన్స్, భూ సేకరణ సమస్యలు పరిష్కరించామన్నారు. బొగ్గు ఉత్పత్తిలో ఒక్క రోజు ఆలస్యమైనా సంస్థకు భారీ నష్టమన్నారు. మణుగూరు నుంచి బీటీపీఎస్కు క్వాలిటీ బొగ్గు ఇవ్వడంపై వారానికోసారి రెండు సంస్థలు మీటింగ్ పెట్టి సమస్యలు సరిచేసుకోవాలన్నారు. కాగా, పీకే ఓసీ 2 డిప్ సైడ్ బ్లాక్ను కేటాయించేలా చొరవ చూపాలని అధికారులు డీసీఎంను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, జెన్కో సీఎండీ హరీశ్, కలెక్టర్ అంకిత్, డైరెక్టర్లు పాల్గొన్నారు
